భారత్ కు అమెరికా మరో షాక్ ? 4 కోట్ల విలువైన మామిడి పండ్ల ధ్వంసం

భారత్-అమెరికా మధ్య బంధాలు క్రమంగా బీటలు వారుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను మధ్యలోనే నిలిపేసి కాల్పుల విరమణ చేపట్టేలా ప్రధాని మోడీపై ఒత్తిడి చేసి ఒప్పించిన అమెరికా.. ఆ తర్వాత భారత్ తమకు 100 శాతం సుంకాల మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చిందని ఏకపక్షంగా ప్రకటించింది. ఈ రెండు షాకుల నుంచి కోలుకోక ముందే భారత్ కు అమెరికా మరో షాకిచ్చింది..

అమెరికాకు భారత్ నుంచి వెళ్లిన 15 మామిడి పండ్ల షిప్ మెంట్ లను దేశంలోని వివిధ ఎయిర్ పోర్టుల్లో అధికారులు నిలిపివేశారు. సరైన పత్రాలు లేవనే కారణం చూపుతూ వాటిని దేశంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. వీటి విలువ 5 లక్షల అమెరికా డాలర్లు. ఇది భారతీయ కరెన్సీలో 4.28 లక్షలు. దీంతో వీటిని తిరిగి భారత్ కు తీసుకెళ్లిపోవడం లేదా అక్కడే ధ్వంసం చేయాల్సిన పరిస్దితి రైతులకు ఎదురైంది. దీంతో తిరిగి ఇంత సరుకు భారత్ కు రవాణా ఛార్జీలు భరించి తీసుకెళ్లే పరిస్దితి లేక అక్కడే ధ్వంసం చేసేస్తున్నారు..

భారత్ నుంచి వచ్చిన మామిడి పండ్లను లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా సహా పలు ఎయిర్ పోర్టుల్లో అమెరికా అధికారులు ఏకకాలంలో అడ్డుకోవడం వెనుక ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో అక్కడికి మామిడి పండ్లను పంపిన భారతీయ రైతులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ ఘటనతో మరోసారి అమెరికాకు మామిడి పండ్లు పంపేందుకు రైతులు సాహసించలేని పరిస్దితి ఎదురవుతోంది. వాస్తవానికి భారత్ కు అతిపెద్ద మామిడిపండ్ల ఎగుమతిదారుగా ఉన్న అమెరికా తీసుకున్న నిర్ణయం కేంద్రానికి కూడా షాకిచ్చినట్లు తెలుస్తోంది.

కాల్పుల విరమణపైనా, ఆ తర్వాత సుంకాలపైనా ట్రంప్ ప్రకటనల్ని భారత్ ప్రభుత్వం ఖండిస్తూ వస్తున్న పరిస్దితుల్లో ఈ మామిడి పండ్ల తిరస్కరణ వ్యవహారం ఇరు దేశాల్లోనూ చర్చనీయాంశమైంది. అయితే దీని వెనుక ఉన్న ఉద్దేశమేంటో అమెరికా, భారత్ ఇరువురూ అధికారికంగా ఇంకా బయటపెట్టలేదు.

Share this