జిల్లా స్థాయి చదరంగం పోటీ విజేతలకు బహుమతి ప్రదానం

*  రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులు: మన్విత్ నాయక్, శివ కార్తికేయ, రిషిత బాయ్, సాయి తేజస్

*   నిరంతర సాధన విజేతలుగా నిలుపుతుంది: డాక్టర్ రవి కృష్ణ

నంద్యాల  :   జిల్లా చెస్ సంఘం నిర్వహణలో సంజీవ నగర్ లో ఉన్న రామకృష్ణ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 11 సంవత్సరాల లోపు బాల బాలికలుకు జరిగిన జిల్లా స్థాయి చదరంగం పోటీలలో విజేతలకు  పతకాలు, ట్రోఫీలు అందజేశారు. నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి  రామసుబ్బారెడ్డి నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, జిల్లా క్రీడా ప్రాదేశిక అధికారి నరసింహారాజు అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.  ఈ సందర్భంగా జిల్లా క్రీడా అధికారి నరసింహ రాజు మాట్లాడుతూ గెలిచిన వారు తమ గెలుపు  స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, విజయం అందుకోని వారు తదుపరి పోటీలలో విజయాలు సాధించడానికి క్రీడా స్ఫూర్తితో కృషి చేయాలని కోరారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ కోచ్ ల పర్యవేక్షణలో  నిత్య సాధన చేయడం ద్వారా క్రీడలలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు.అంకితభావం, క్రమశిక్షణ  క్రీడాకారులకు చాలా అవసరం అన్నారు.

ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ మునిశేఖర్, జిల్లా క్రీడాభారతి కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్ ,జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ఆర్బిటర్ సుజాత పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన నంద్యాల జిల్లా చదరంగం పోటీ విజేతలు : 11 సంవత్సరాల లోపు ఓపెన్ విభాగంలో మొదటి స్థానం మన్విత్ నాయక్ ,రెండవ స్థానం శివ కార్తికేయ సాధించగా,బాలికల విభాగంలో మొదటి స్థానం రిషిత బాయి,రెండవ స్థానం సాయి తేజస్  విజేతలుగా నిలిచి ట్రోఫీలు అందుకున్నారు.

జిల్లా జట్టుకు ఎంపికైన వారు : ఈ నెల 24 ,25 వ తేదీలలో  నరసరావుపేటలో జరగబోవు రాష్ట్రస్థాయి 11 సంవత్సరాల లోపు ఓపెన్ మరియు బాలికల చెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారు.

Share this