గుంటూరు మే 5 : నాటక రంగం నుండి ఆవిర్భవించిన మహానటుడు నాగభూషణం కళలకు, కళాకారులకు, సమాజానికి చేసిన సేవ నిస్వార్ధమైనదని అన్నమయ్య గ్రంథాలయ వ్యవస్థాపకుడు లంకా సూర్యనారాయణ పేర్కొన్నారు. నటుడు చుండి నాగభూషణం గురించి తొలిసారిగా ప్రచురించిన పుస్తకాన్ని సోమవారం నాగభూషణం వర్ధంతి సందర్భంగా సూర్యనారాయణ ఆవిష్కరించారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ అన్నమయ్య గ్రంథాలయంలో జరిగిన ‘రక్తకన్నీరు నాగభూషణం’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో లంకా సూర్యనారాయణ మాట్లాడుతూ..పాశ్చాత్య వ్యామోహంలో సనాతన సంప్రదాయాలను తొక్కేసి, స్త్రీ లోలుడైన ఒక వ్యసన పరుడు పశ్చాతాపంతో తన తప్పును తెలుసుకున్న పాత్రలో నాగభూషణం రక్తకన్నీరు నాటకం మరియు చిత్రం ద్వారా అద్భుతమైన నటనను అందించారని కొనియాడారు. కుష్టురోగం వచ్చి, కళ్ళు పోయిన పాత్రలో రక్తకన్నీరులో నాగభూషణం పలికిన సంభాషణ ఉచ్చారణ ప్రేక్షకుల గుండెల్ని పిండేస్తుందన్నారు. కేవలం నాటకాల ద్వారానే ఆయన సమాజ చైతన్యాన్ని తీసుకువచ్చారని ప్రశంసించారు.
సెంట్రల్ ఎక్సైజ్ విశ్రాంత సూపరింటెండెంట్ గుమ్మడి సీతారామయ్య మాట్లాడుతూ..ముప్పై ఏళ్ల పాటు రంగస్థలం మీద నాగభూషణం రక్తకన్నీరు నాటకం వెలిగిందని, వేల ప్రదర్శనలు సాగయన్నారు. రక్తకన్నీరు నాటకం పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నాగభూషణం, సినిమాల్లో నటిస్తున్నా, నాటక రంగాన్ని మర్చిపోలేదన్నారు. రక్తకన్నీరు ఒక కొత్త చరిత్ర లిఖించిందన్నారు.అందులో ఆయన నటన చిరస్మరణీయమన్నారు. తెలుగు నాటకరంగ పుటలలో రక్తకన్నీరుకు సుస్థిర స్థానం దక్కుతుందన్నారు.జి.ఎస్.టి సూపరింటెండెంట్ మిక్కిలినేని శ్రీనివాస్ మాట్లాడుతూ నాగభూషణం నటనలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ ప్రజాదరణ పొందారన్నారు. నటుడిగా విభిన్న పాత్రలు చేసిన ఆయనకు అరుదైన ఖ్యాతి దక్కిందన్నారు. విలన్ పాత్ర పోషణలో సొంత శైలి సృష్టించుకొని రాణించారన్నారు. వెటకారం, వ్యంగం, హాస్యం ఆయనలో ఉట్టిపడేవన్నారు. నటన ఆయనకు కొట్టిన పిండి అని, ఏ పాత్రనైనా సునాయాసంగా పోషించగల నటదిగ్గజం అని కీర్తించారు. రజీ పబ్లికేషన్స్ ప్రతినిధి వేగి దుర్గారావు మాట్లాడుతూ.. ఎ.పి లో ఈ పుస్తకం తొలి ప్రతిని లంకా సూర్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించి, విడుదల చేస్తున్నామన్నారు. ఈ పుస్తకాన్ని ఒక అభిమాని ప్రచురించటం విశేషమన్నారు.అన్నమయ్య గ్రంథాలయ పాలకురాలు సుహాసిని మాట్లాడుతూ..తమ గ్రంథాలయంలో మహానటుల అందరి జీవిత చరిత్రలు అందుబాటులో ఉన్నాయన్నారు.ఈ పుస్తకాన్ని జర్నలిస్టు ఉదయగిరి ఫయాజ్ రచించారు.
Leave a Reply